మూత్రం చెప్పే ఆరోగ్య నిజాలు…..మీ మూత్రం రంగును బట్టి ఆరోగ్యాన్ని పసిగట్టొచ్చు .

మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.రక్తనాళికా గుచ్ఛము (Glomerulus) లో జరిగే రక్త ప్రవాహము నుండి మూత్రము ఏర్పడుట వలన దీనిని రక్తము యొక్క గాలితముగా భావించవచ్చును. ఇందువలన రక్తంలోని ప్లాస్మా, మూత్రములో ఒకే రకమైన అంశాలను భిన్న గాఢతలలో కలిగివుంటాయి. మూత్రం ఏర్పడే విధానం మూడు దశలలో జరుగుతుంది.

మూత్రానికి రంగు (color) రావడానికి మూత్రంలో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్‌ అనే ఎర్రటి రంగు పదార్థం.

ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్‌ బైలిరూబిన్‌ గానూ, తదుపరి యూరోక్రోమ్‌ గానూ విచ్ఛిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలలో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు మూత్రం కూడా ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ళ రంగులో కాని ఉంటుంది. నీళ్ళు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది.

మూత్ర పరీక్ష :చరిత్రలో చాలా మంది వైద్యులు రోగుల మూత్రాన్ని పరీక్షించి రోగ నిర్ధారణ చేశారు. హెర్మోజెనిస్ (Hermogenes) ముత్రం యొక్క రంగు, ఇతర లక్షణాల ఆధారంగా కొన్ని వ్యాధుల్ని గుర్తించినట్లుగా రాశాడు. మధుమేహం పేరు వ్యాధిగ్రస్తుల తియ్యని మూత్రం ఆధారంగా వచ్చింది. మూత్ర పరీక్షలు వైద్య పరీక్షలలో చాలా ప్రాథమికమైనవి. మూత్రాన్ని సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించి ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల్ని గుర్తించవచ్చును.